అక్షర సుగంధం కవిత్వం; ర: దేవలపల్లి సునంద; పు: 104; వె: Rs100; ప్ర: పాలపిట్ట బుక్స్, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాదు-36, 98487 87284
ఎమర్జెన్సీ జ్ఞాపకాలు వ్యాసాలు; ర: వేదుల నరసింహం; పు: 160; వె: Rs100; ప్ర: సాహిత్య నికేతన్, ఏలూరు రోడ్, గవర్నరుపేట, విజయవాడ -520002, 94406 43348
ఆత్మీయతకు ప్రతిరూపం హల్దేకర్జీ వ్యాసాలు; ప్రచురణ: శ్రీ భోగాది దుర్గాప్రసాద్ స్మరక సమితి; పు: 176; వె: Rs120; ప్ర: సాహిత్య నికేతన్, కేశవనిలయం, హైదరాబాదు, 040 27563236
కవీంద్ర మోక్షం కవిత్వం; ర: రఘుశ్రీ; పు: 110; వె: Rs100; ప్ర: వి.శ్రీలక్ష్మి, 2-1-421, ఫ్లాట్ నం.202, సాయినీ నిలయం, వీధి నం.4, నల్లకుంట, హైదరాబాదు -500004, 92471 08893
మహాభారతం - మతదర్శనం-1; ర: చంద్రశేఖరరెడ్డి చేగిరెడ్డి; పు: 228; విరాళం: Rs220; ప్ర: రచయిత, మొహిదీన్పురం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా-523336, 98663 09589
భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన వ్యాసాలు; ర: డా।। బి.సారంగపాణి; పు: 350; వె: Rs250; ప్ర: సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్పుర, హైదరాబాదు, 040 27563236
భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు వ్యాసాలు; ర: దామోదర సావర్కర్; పు: 368; వె: Rs250; ప్ర: సాహిత్యనికేతన్, ఏలూరురోడ్, గవర్నరుపేట, విజయవాడ, 94406 43348
భూమిపుత్రుడు కవిత్వం; ర: విడదల సాంబశివరావు; పు: 112; వె: Rs100; ప్ర: రచయిత, 3-173/1, పండరీపురం, చిలకలూరిపేట - 522616, గుంటూరు జిల్లా, 98664 00059
చైనాలోని పరిణామాలు భారత-చైనా సంబంధాలపైన...; ర: దేవులపల్లి వెంకటేశ్వరరావు; పు: 296; వె: Rs150; ప్ర: పోరునేల, హైదరాబాదు, 77028 88998, ప్రముఖ పుస్తక కేంద్రాలు
మహాప్రవక్త ముహమ్మద్ ఆధ్యాత్మికం; ర: అలపర్తి పిచ్చయ్య చౌదరి; పు: 100; వె: అమూల్యం; ప్ర: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప - 516002, 91770 13845
పద్య సిందూరం పద్యసాహిత్యం; ర: ఐతా చంద్రయ్య; పు: 72; వె: Rs80; ప్ర: రచయిత, ఇం.నం.4-4-11, శేర్పూర, సిద్ధిపేట - 502103, 093912 05299
యక్ష ప్రశ్నలు మహాభారతం; ర: కప్పగంతు వెంకట రమణమూర్తి; పు: 32; వె: Rs35; ప్ర: గ్లోబల్ న్యూస్, బి2, ఎఫ్12, రామరాజా నగర్, సుచిత్రా సెంటర్, సికింద్రాబాదు-67, 92461 65059
విజయ సోపానాలు కవిత్వం; ర: ఎం.ఎన్.విజయకుమార్; పు: 64; వె: Rs50; ప్ర: రచయిత, పాఠశాల సహాయకులు, హిందీ, 14-5-209/5, మధురానగర్, మహబూబ్నగర్, 97031 86814
నారీ సంస్కృతి వ్యాసాలు; ర: డా।। ఎన్.శాంతమ్మ; పు: 114; వె: Rs100; ప్ర: రచయిత్రి, ఫ్లాట్ నం.302, ప్రశాంత్ టవర్స్, రైల్వే స్టేషన్ రోడ్, కర్నూలు-518002, 99080 58172
శాంత తరంగిణి వ్యాసాలు; ర: సి.రోజమ్మ; పు: 56; వె: ఉచితం; ప్ర: రచయిత్రి, హెడ్, సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సుంకేశుల రోడ్, కర్నూలు-518002, 99122 56565
భలే మంచిరోజు న్యూమరిక్కులు; ర: డా।। రమణ యశస్వి; పు: 154; వె: Rs100; ప్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, విజయవాడ-3, 96188 48470
మహోన్నత శిఖరాలు కవితా మాలిక; ర: వావిలిపల్లి రాజారావు; పు: 184; వె: Rs100; ప్ర: వావిలిపల్లి సుజాత, గాంధీనగర్ వీధి, పొందూరు, శ్రీకాకుళం జిల్లా, 99636 06391
గుమ్మటాలు బాలల గీతాలు; ర: డా।। వడ్డి విజయసారథి; పు: 60; వె: Rs60; ప్ర: సాహిత్య నికేతన్, విజయవాడ, 94406 43348; సాహిత్య నికేతన్, హైదరాబాదు, 040 27563236
రామణీయకం పద్యాలు; ర: డి.రాములు (రాము); పు: 80; వె: అమూల్యం; ప్ర: రచయిత, 24సి-3-22, మంచినీళ్ల తోట, వినాయకగుడి వీధి, పత్తేబాద, ఏలూరు-534002, 94403 76688
మరణానంతర జీవనం ఆధ్యాత్మికం; ర: డా।। పెద్దాడ వేంకట లక్ష్మీ సుబ్బారావు; పు: 34; వె: Rs10; ప్ర: రచయిత, 204, సాయి ఎన్క్లేవ్, లంకవీధి, విజయనగరం, 94410 58797
సంపాదకులు: ఆచార్య జయధీర్ తిరుమలరావు; పుటలు:262; వెల: Rs150; ప్రతులకు: తెలంగాణ రీసోర్స్సెంటర్, హైదరాబాదు; 99519 42242
పాట ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం వరకూ మనిషిని చైతన్యవంతం చేస్తోంది. అది మనిషిని సంతోషపెట్టడమే కాదు అవసరమైతే ఉద్యమాల బాటలోనూ నడపగలదు. పెను ఉప్పెన సృష్టించగలదు. స్వాతంత్య్ర సమరంలో ప్రజల్ని వెన్నుతట్టి, స్ఫూర్తిని కోల్పోకుండా ఉద్యమంలో నిలిపేందుకు ఎందరో కవులు వేలాది పాటలు రాశారు. నిజాంరాజుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధపోరాటం మొదలుకొని, 1969లో వచ్చిన జైతెలంగాణ, ఇటీవల భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటుకు దారితీసిన మలిదశ తెలంగాణ ఉద్యమందాకా పాటది ప్రత్యేకస్థానం. తెలంగాణ ఉద్యమానికి పాటకు ఎంత లంకె ఉందంటే... ఏ కొంచెం కవిత్వం వచ్చిన వాళ్లైనా ఒక పాట రాయాలనుకున్నంత. ఎంతోమంది కవులు రాసిన ఎన్నో పాటలు తెలంగాణ ప్రజల్ని ఉర్రూతలూగించాయి. అసలు ఉద్యమమంటే పాటే అన్నంతగా... ‘పొడుస్తున్న పొద్దుమీద’ (గద్దర్), ‘జైబోలో తెలంగాణ’ (అందెశ్రీ) లాంటి పాటలు ప్రజల నాలుకలపై నాట్యమాడాయి. తద్వారా ప్రజలు ఉద్యమంలో పాల్గొనేందుకు, తమ కల సాకారం చేసుకునేందుకు ఉపకరించాయి. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా కనీసం విని ఉప్పొంగిన హృదయాలెన్నో.
వేలాదిగా వచ్చిన పాటల్లో 101 పాటల్ని ఎన్నుకొని తెలంగాణ రిసోర్స్ సెంటర్ ‘ఒక్కొక్క పాటేసి...’ పేరుతో ప్రచురించింది. గద్దర్ రాసిన ‘అమ్మా తెలంగాణమా- ఆకలి కేకల గానమా’ పాటతో ప్రారంభమయ్యే పుస్తకం అదే గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దుమీద...’ పాటతో ముగుస్తుంది. ఇంకా ఇందులో అందెశ్రీ రాసిన ‘జైబోలో తెలంగాణ’, ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’, గోరటి వెంకన్న పల్లెలపై ప్రపంచీకరణ ప్రభావాన్ని కళ్లకు కడుతూ రాసిన ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’, నందిని సిధారెడ్డి ‘నాగేటి చాలల్లో నా తెలంగాణ’ లాంటి పాటలతోపాటు, యాదగిరి, భూపాల్, దేశపతి శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, సుద్దాల అశోక్తేజ, చెరబండరాజు, గూడ అంజయ్య, జయరాజ్, వరవరరావు, మిత్ర మొదలైన కవుల పాటలు ఉన్నాయి. తెలంగాణలోని పది జిల్లాల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, సమకాలీన పరిస్థితులు ఈ పాటల్లో వ్యక్తమవుతాయి. ఈ సాహిత్యాన్ని తెలుగువాళ్లకు అందించాలన్న స్ఫూర్తితో ఆచార్య జయధీర్ తిరుమలరావు సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం ఈ ‘ఒక్కొక్క పాటేసి...’
- హర్ష
రచయిత:ఖరిడేహాల్ వేంకట రావు; పుటలు: 96; Rs:150; ప్రతులకు: కె.వి.భీమారావు; హైదరాబాదు, 9848444841
సూర్యుడు జీవ చైతన్యానికి మూల కారకుడు. మానవ దైనందిన కార్యక్ర మాలన్నీ సూర్య ఆగమ, నిరాగమనాలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే యుగాల నుంచీ సూర్యుణ్ని దేవుడిగా కొలుస్తున్నాం. హైందవ సంప్రదాయంలో సూర్యుని ప్రశస్తి అధికం. రావణుడితో యుద్ధ సమయంలో రామచంద్రుడు సూర్యుడి గురించి ప్రార్థన చేశాడట. అదే ఆదిత్యహృదయం. ఆ యుద్ధంలో అలసిన రాముని మొహంలో కొంచెం నీరసం, మరింత ఆలోచన కనిపించాయట. అప్పుడు అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు.
దీన్ని మూడు సార్లు పఠించి, సూర్యునికి నమస్కరించి తిరిగి యుద్ధంలో పాల్గొనమనీ, విజయం తథ్యమనీ దీవించారు. ఇది శత్రుసంహారంలో రాముడికి ఎంతగానో ఉపయోగపడిందని ప్రతీతి.
- ఐ. హరిత
రచయిత: ఆమని కృష్ణమోహన్; పుటలు: 97 వెల: 50 ప్రతులకు: రచయిత, కొల్లాపూర్, మహబూబ్నగర్, 97043 65847
గేయ, భావ కవిత్వాల సంకలనం ఆమని కృష్ణమోహన్ రాసిన ‘వలపట- దాపట’. పేరుకు తగ్గట్టు కుడి ఎడమల దగాను కవిత్వంలో చిత్రిక పట్టారు. ‘వలపట’లో కవితా సమాహారమైన తెలంగాణ చుక్కల ద్వారా పోరుగడ్డకు జరిగిన అన్యాయాన్ని చాటారు. తెలంగాణ సాహిత్యాన్ని ద్విగుణీకృతం చేసిన మహాకవులు కాళోజీ, దాశరథి, సురవరాలకు తన భావావేశ సిరా చుక్కలతో శిరసు వంచి వందనం సమర్పించారు. తెలంగాణకు చుక్కలై వెలసిన అమరవీరులకు అక్షర నీరాజనం పట్టారు. ఇక ‘దాపట’లో తన సుదీర్ఘ కవితతో సమాజ పోకడలపై ఆవేదన ప్రకటిస్తూ అంతఃస్పందనను అక్షరాల్లా పొదిగారు. ఉరకలెత్తి ఉప్పెనలా పొంగిన ఉద్వేగసాహిత్యంతో వలువలూడుతున్న విలువల చరిత్రను భావుకత జోడించి నినదించారు.
- పావులూరి కిశోర్బాబు
మలయాళ మూలం: కె.పి.రామనున్ని; అనుసృజన: ఎల్.ఆర్.స్వామి; పుటలు: 122, వెల: Rs75/-; ప్రతులకు: నవోదయ బుక్హౌస్; 040 24652387
మన చుట్టూ ఉన్న అద్భుత ప్రపంచాన్ని తెలుసుకోవడానికి అనువాద సాహిత్యాన్ని మించింది లేదు. తెలుగులో నవలతోపాటు కొన్ని ప్రక్రియలు అడుగంటి పోతున్న తరుణంలో మలయాళం నుంచి సంచలనాత్మక ‘సూఫీ చెప్పిన కథ’ నవలను తెలుగు పాఠకులకు అందించినందుకు సారంగబుక్స్ యాజమాన్యాన్ని, ముఖ్యంగా రెంటాల కల్పనను అభినందించాలి. ఈ నవల మాతృక పేరు ‘సూఫీ పరాంజే కథ’. రామసున్ని మలయాళంలో రాసిన నవలను ఎల్.ఆర్.స్వామి తెలుగులోకి అనువదించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలన్నీ నాయిక కార్తి, నాయకుడు మమ్ముటిలవే అయినా మన దేశంలో ప్రధానంగా ఉన్న రెండు మతాలు, రెండు జీవన విధానాల మధ్య సాగుతున్న ఘర్షణలు, కలహాలు, అపోహలు, సందేహాలు, భయాలు ఇందులో చిత్రితమయ్యాయి. ‘సూఫీ చెప్పిన కథ’పైకి చలం ‘మైదానం’లా కనిపించినా, స్త్రీ పురుషుల మధ్య కేవలం ఆకర్షణ, లైంగిక సంబంధమేకాక అనురాగంతో కూడిన ఆత్మానుబంధం గాఢంగా ఉందన్న విషయం ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది. అదే ఈ నవలకున్న ప్రత్యేకత! ప్రతివాక్యం కవితాత్మకం. ఈ కవిత్వం ఎంతగా విస్తరించిందంటే అసలు విషయాన్ని దాటి పాఠకుల్ని కవనవనంలో విహరింప చేసేంత! కొన్ని అధ్యాయాల్లో అయితే విషయపరమైన మలుపులు ఉన్నా కవిత్వమే పున్నమి వెన్నెల్లా పరచుకొనేంత! పాత మాటల తోనే ఈ ‘పరిమళం’ ఎలా సాధ్యమైందని పాఠకులు నివ్వెర పోతారు! ఆశ్చర్యానికి లోనవుతారు! నంబూద్రి బ్రాహ్మణ కుటుంబ సంప్రదాయాలు, మమ్ముటి ముస్లిం జీవన విధానం మన తెలుగు వాతావరణానికి భిన్నంగానేకాక మనకు పరిచయం లేని అనేక జీవిత పార్శ్వాల్ని ఈ నవల పరిచయం చేస్తుంది. కల్పన అన్నట్లు ‘నవలలోని చాలా సంఘటనల వెనుక ఉన్న హేతువు మన మామూలు అవగాహనకు అందదు. సులభంగా విడివడలేని చిక్కుముడులే నవలకు కొత్త అందాన్నిచ్చాయి’. ఈ నవల దుఃఖాంతంగా ముగిసినా కార్తిపాత్ర మాత్రం మనకు కళ్లముందు కదలాడుతుంటుంది. భార్య కోసం మతపెద్దల్ని ధిక్కరించి అమ్మవారి గుడిని ఇంటి ఆవరణలో కట్టిన మమ్ముటి ప్రేమనీ, సాహసాన్నీ అర్థం చేసుకోవడానికి మనం ఈ సమాజ కట్టుబాట్లను దాటక తప్పదు. తెలుగు భాష ఇంత సౌందర్యాత్మక కవిత్వంలాగా ఉంటుందనడానికైనా ఈ నవల తప్పక చదవాలి. వస్తువు, భాష, శైలి ఏ విధంగా చూసినా ఇదో కవితాత్మక సంచలనం!
- సి.హెచ్.లక్ష్మి
రచయిత: డా।। ఎన్.గోపి; పుటలు: 100; వెల:Rs100; ప్రతులకు: ఎన్. అరుణ, హైదరాబాదు, 27037585; విశాలాంధ్ర పుస్తక కేంద్రాల్లో
ఇటీవల తాను రాసిన పదిహేను సాహితీ వ్యాసాలను, రాంపా గీసిన అందమైన ముఖచిత్రంతో ‘వ్యాస కలశం’ పుస్తకంగా తీసుకొచ్చారు డా।। ఎన్.గోపి. సినారె రాసిన ‘మా ఊరు మాట్లాడింది’ అనే వ్యాస సంపుటి గురించి ‘పుట్టిన ఊరును మాట్లాడించిన మట్టిబిడ్డ సినారె’ అనే మొదటి వ్యాసంలో రచయిత హృద్యంగా వివరించారు. తెలంగాణ మాండలికంలోని సొబగులను, భాషలోని మర్మాలను సినారె విప్పి చూపిన తీరును వ్యాసకర్త తెలియజేశారు. ప్రామాణిక భాష అనేది కేవలం ఒక కల్పనని, ఈ ప్రామాణిక వాదన ఆర్థిక, సామాజిక పరమైందేకానీ భాషా వ్యవహార పరమైంది కాదని, అదో అశాస్త్రీయ భావనని ఎన్.గోపి ఈ వ్యాసంలో ఒకచోట అన్నారు. భాషా విషయంగా ఈ అభిప్రాయంతో విభేదించే వారున్నప్పటికీ, సినారె గురించిన చక్కటి వ్యాసాన్ని చదివిన అనుభూతికి పాఠకులు తప్పకుండా లోనవుతారు. ఇంకా ‘బతుకమ్మలో జీవిస్తున్న నక్క ఆండాళమ్మ’ అని తన సొంత అక్క గురించి రచయిత రాసిన వ్యాసం చదువరులను కంటతడి పెట్టిస్తుంది. 1951 పంద్రాగస్టు రోజున ఆండాళమ్మపై ముష్కరులు సామూహిక అత్యాచారం జరిపి, చంపేసిన వైనం చదివి అఘాతానికి గురవుతాం. ఇంకా హిందీ అనువాద పితామహుడు బాలశౌరిరెడ్డి, పాత్రికేయుడు ఎం.వి.ఆర్ శాస్త్రి, కథకుడు సి.రామచంద్రరావు, కవులు పాపినేని శివశంకర్, ఓల్గా, దివాకర్ల రాజేశ్వరి, రాళ్లబండి కవితాప్రసాద్, రామాచంద్రమౌళి మొదలైన వారి రచనా వ్యాసంగం గురించి, ప్రత్యేకతల గురించి ఎన్.గోపి ఎన్నో విలువైన అంశాలను గుది గుచ్చారు. ‘సహృదయుడంటే ఎవరు?’, ‘సాహిత్యమూ సందర్భమూ’ అనే రెండు వ్యాసాల్లో మన ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను విశ్లేషించారు రచయిత. ఎన్.గోపి స్వీయ రచన ‘జలగీతం’ కవితా సంపుటి గుజరాతీ అనువాదానికి రమణిక్ సోమేశ్వర్కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా రాసిన వ్యాసమూ ఇందులో చోటు చేసుకుంది. ఇక వేమన గురించి ఎంతో పరిశోధించిన రచయిత ఆ ప్రజాకవి గురించి రాసిన రెండు వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సాహితీ ప్రియులకు, విద్యార్థులకు ఉపయుక్తమైన సాహితీ వ్యాసాల గని ఇది.
- కె.రఘు
రచయిత: డా.కడిమిళ్ళ వరప్రసాద్; పుటలు: 32; వెల: Rs40; ప్రతులకు: కె.రమేష్, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా. 92478 79606
జ్ఞానభిక్ష పెట్టి జీవితంలో అజ్ఞానాంధ కారాన్ని దూరం చేస్తాడు గురువు. ఒక జాతి సమగ్ర వికాసానికి సద్గురువులే బాటలు వేస్తారు. అలాంటి గురువులపట్ల ఎలా మెలగాలో తెలుపుతూ డా.కడిమిళ్ళ వరప్రసాద్ రాసిందే ఈ ‘శిష్యశతకము’.
ఇది నీతిబోధ ప్రధానంగా సాగుతుంది. బెత్తము గొని పొత్తముపై/ జిత్తము మళ్ళించి, నీదు జీవితమెల్లన్... పద్యంలో చేతిలో బెత్తం పట్టుకుని, మన చిత్తాన్ని పుస్తకం పైకి మళ్లించి, జీవితాల్ని బంగారంగా మార్చే పరుసవేది విద్య తెలిసిన గురువును భక్తితో పూజించమంటారు.
ఇందులో గురుశిష్య సంబంధంతో పాటు, తల్లిదండ్రులతో, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలిపే పద్యాలు, ఇతర సమకాలీన అంశాల ప్రస్తావనా ఉంది. మొత్తానికి ఈ పుస్తకం పాఠకులకు సుబోధకంగా ఉంటుంది.
- సునీతా సత్యనారాయణ
రచయిత: డా. కొప్పుల హేమాద్రి; పుటలు:88; వెల: Rs180; ప్రతులకు: రచయిత, 0866- 2541711 koppulahemadri@yahoo.com
భూమిమీద జీవుల మనుగడకు కారణం గాలిలోని ఆక్సిజన్. అందుకే అది ప్రాణవాయువు. ఈ ఆక్సిజన్ను తయారుచేసేవి చెట్లు. భూమిమీద శక్తి ప్రసరణకు కారణం సూర్యుడైతే, ఆహారానికి ప్రాథమిక వనరులు చెట్లు, మొక్కలు. అంతేనా... ఇంట్లో వంటచెరకుగా, బల్లలు, కుర్చీలు, మంచాలు, ఇంటి అలంకరణకు, నీడకు ఇలా చెట్టు ఉపయోగం ఎంతో. మొత్తానికి మనదీ చెట్లదీ విడదీయలేని బంధం. అలాంటి చెట్ల గురించి విసుగు లేకుండా పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా వివరించిన పుస్తకం డా. కొప్పుల హేమాద్రి రాసిన ‘వీరి వీరి గుమ్మడిపండు’.
సాధారణ పాఠ్యపుస్తకాలకు భిన్నంగా చేసిన ప్రయత్నం ఇది. ఆంధ్రిక అనే అమ్మాయికి వృక్షశాస్త్ర ఉపాధ్యాయుడైన ఆమె మేనమామ చెప్పిన పాఠాలే ఈ పుస్తకం. ఇందులో చెట్టు ప్రాథమిక అంశాలు మొదలుకొని పిల్లలకే కాదు, పెద్దలకూ అంతగా తెలియని ఆసక్తిదాయకమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఇందులో మన పరిసరాల్లో కనిపించే బూరుగు, రావి, రేల, రేగు, వేప, మర్రి, మోదుగు లాంటి చెట్ల విశేషాలు వివరంగా చెప్పారు. అంతేకాదు... వాటి శాస్త్రీయ నామాలు, అవి లాటిన్లోనే ఎందుకు పెట్టాలన్న కారణాన్నీ చెప్పారు. ఇంకా బూరుగుదూది చెట్టు లేత పిందే మరాఠీమొగ్గగా మారిన వైనం, సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో ముడుచుకుపోయిన నిద్రగన్నేరు ఆకులు, చెట్టు వయసు చెప్పే వలయాలు, అయిదు వేల సంవత్సరాలకు పైగా బతికే బ్రహ్మఆమ్లిక వృక్షం విశేషాలతోపాటు, సందర్భానుసారంగా బాదరాయణ సంబంధం, కాకతాళీయాలూ మనల్ని పలకరిస్తాయి. 88 పేజీల ఈ చిరుపుస్తకంలో వృక్షాల వివరాలతోపాటు వాటికి సంబంధించిన పజిల్సూ, ప్రశ్నలు, జతపరచడం, తెలుగు పేర్లు- శాస్త్రీయ నామాలు ఇవ్వడం ఔత్సాహికులకు మంచి హోంవర్కు.
కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా ఇలాంటి పుస్తకాలు చదివి, సంపాదించుకున్న జ్ఞానాన్ని పరిసరాలతో బేరీజు వేసుకుంటే విద్యార్థులకు చదువంటే విసుగు పుట్టించే వ్యవహారంలా మిగిలిపోదు. బడి, హోంవర్కు, టీవీలు, కంప్యూటర్లతోనే రోజులు గడుపుతున్న ఈతరం పిల్లలకు ప్రయోగాత్మకంగా ఉండే ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది.
- హర్ష
రచయిత: పులికొండ సుబ్బాచారి; వెల: Rs225; పుటలు: 239; ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాదు, 040 - 24652387
పీహెచ్డీ, ఎంఫిల్.. ఈ రెండు చేయడం ఒక ఎత్తయితే వాటి వివరాలను పుస్తకంగా తీసుకురావడం ఓ పెద్ద తంతు. దీనికి ప్రత్యేకమైన కారణమంటూ ఏమీలేదు. తెలుగులో తొలి పరిశోధక గ్రంథం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా ఇప్పటికీ సరైన శైలి లేకపోవడమే అసలు సమస్య. దీంతోపాటు పరిశోధన, గ్రంథ రచన విషయంలో నియమాలు, నిబంధనలు అంటూ ఏవీ లిఖిత పూర్వకంగా పూర్తిస్థాయిలో లేవు. ఇలాంటి సమస్యలన్నింటినీ వివరిస్తూ పరిష్కారాన్ని చూపే సంపుటే పులికొండ సుబ్బాచారి రాసిన ‘పరిశోధన విధానం - సిద్ధాంత గ్రంథ రచన’. పరిశోధనలు చేయాలనుకునేవారు ఎలా ఆలోచించాలి, అంశాల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మార్గదర్శకుడిని ఎంపిక చేసుకోవాలి అనే అంశాల నుంచి పరిశోధన ఎలా సాగించాలి, దాన్ని ఎలా ఒక రూపులోకి తెచ్చుకోవాలి, సంబంధించిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, గ్రంథ రచనకు అంతర్జాలం ఎలా ఉపయోగపడుతోంది వంటి విషయాలు చర్చించారు. విదేశాల్లో గ్రంథ రచన, పరిశోధన ఎలా ఉంది. నాటికి నేటికి ఎలా రూపాంతరం చెందిందనే విషయాలను వెల్లడించారు. ప్రతి విషయానికి చక్కటి ఉదాహరణతో రచనను కొనసాగించారు. అంతేకాకుండా గతంలో గ్రంథ రచయితల అనుభవాలనూ ప్రస్తావించారు. ఎం.ఫిల్, పీహెచ్డీ మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలిపారు. పరిశోధనాంశాలపై విశ్వవిద్యాలయాలు వ్యవహరించే తీరును వివరించారు. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రంథ రచనలో మన శైలి, విధానం, పాటిస్తున్న నియమాల పట్ల సునిశిత విమర్శలు చేశారు. మనమే స్థితిలో ఉన్నాం, దీనికి కారణమెవరనే ప్రశ్నలకు సమాధానం ఉంది. గతంలో జరిగిన విషయాలను స్పష్టంగా తెలిపారు. ప్రతి విషయానికి చక్కటి ఉదాహరణలు చెప్పారు. పరిశోధనతో సమాజానికి జరిగే మేలు గురించి, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవం పరిశోధనకు ఎలా మేలు చేస్తుంది, అంతర్జాలం లేకపోవడం వల్ల పడ్డ ఇబ్బందులు చక్కగా చెప్పారు. రచన చేశాక దానికి అదనపు సమాచారం ఎలా జోడించాలి, వాడుకున్న సమాచారానికి క్రెడిట్స్ ఎలా తెలపాలి వంటి విషయాల్ని స్పష్టంగా తెలిపారు. అలా చెప్పకపోతే ఎదురయ్యే సమస్యలను వివరించారు. ఆఖరులో గ్రంథచౌర్యం, పరిశోధనలో నీతి, మర్యాద వంటి అంశాలను ప్రస్తావించి రచనను పూర్తి వివరాలతో ముగించారు.
- ఎస్.రామకృష్ణ
సంపాదకులు: ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్; పుటలు:544; వెల:Rs350; ప్రతులకు:విశాలాంధ్ర, నవోదయ పుస్తక కేంద్రాల్లో
కథ... చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడానికి గద్యసాహిత్యంలో ఇంతకంటే బలమైన ఆయుధం లేదు. కవులకు కావలసింది భావుకత అయితే, కావాల్సిన వస్తువుని సూక్ష్మంగా గమనించడం, ఆ వస్తువుకి తగిన శిల్పాన్ని సమకూర్చుకోవడం, వస్తు-శిల్పాల అమరిక చెదరకుండా విషయాన్ని వివరించడంలోనే కథకుని నేర్పు తెలుస్తుంది.
తరచిచూస్తే మనిషి జీవితంలో ప్రతి సంఘటనా ఒక కథావస్తువు కాగలదు. తమ జీవితానుభవాల్లోని సంఘటనలకు కల్పన జోడించి 34 మంది ఉత్తమ రచయిత(త్రు)లు సృజించిన కథల సమాహారమే ‘కథ నేపథ్యం- 2వ సంపుటి’.
అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీకి బలైన ‘భద్రయ్య’ని చూస్తే మన చుట్టుపక్కల ఫ్లైఓవర్ వంతెనల కోసమో, విశాలమైన రహదారుల కోసమో చితికిపోయిన తమ్ముళ్లు ఎందరో కనిపిస్తారు. ఉన్నన్నాళ్లు మగరాయుడిలా బతికిన బంగారమ్మ చివరకు ఎలా చనిపోయిందో తెలిపిన ‘వొంటేపమాను’, దేవదాసీలు ఎదుర్కొన్న సవాళ్లని కళ్లకు కడుతుంది. ఇవేకాదు, నమ్ముకున్న భూమిని కోల్పోయి తండ్రిగా, భర్తగా, చివరికి మనిషిగా కూడా ధ్వంసమైన రాజారాం, పసిమొగ్గలపై జరిగే పైశాచిక అత్యాచారాలని మన ముందుంచిన ‘అయోని’, మబ్బుల్లో నీళ్లని చూసి కుండ ఖాళీ చేసే ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో మూలాలకి కట్టుబడి కులం ముఖ్యం కాదు - గుణం ముఖ్యమన్న ‘బతకనేర్వని’ మాధవుడూ... వీళ్లంతా కూడా మీకు ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకసారి తారసపడి ఉంటారు. పుట్టే అన్ని కథలకీ నిజజీవితం నేపథ్యం కాకపోవచ్చు, కానీ నిజజీవిత నేపథ్యంతో పుట్టే కథలు చదివినప్పుడు మనం వాటితో బాగా మమేకమవుతాం. కొన్ని కథలు పేజీ తిప్పగానే మరుగున పడిపోతాయి... కానీ ఇలాంటి కథలు మాత్రం మనల్ని వెంటాడుతాయి. రచయిత పి.చంద్రశేఖర్ ఆజాద్ చెప్పినట్టు కథ రాయడానికి వస్తువులు చిత్రంగానే దొరుకుతుంటాయి. మీ ఇంట్లో పనిచేసే ‘లక్ష్మి’నో, మీరు సిగరెట్లు కొనుక్కునే పాన్షాపు సుబ్బారావునో, పేరు చెప్తే తప్ప తను ముస్లిం అని గుర్తుపట్టలేని మీ ఆఫీసులో పక్క సీటు ఖాదర్నో ఇలా ఎవరినైనా వస్తువుగా తీసుకోవచ్చు. వస్తుశిల్పాల సమతూకంతోపాటు భావోద్వేగాలని కూడా సమపాళ్లలో రంగరించిన ఈ కథలు, వాటి నేపథ్యాలు - ఈ పుస్తకానికి అభిరుచిగల పాఠకుల సేకరణలలో కచ్చితంగా ఉండాల్సిన అర్హత సంపాదించిపెట్టాయి.
- వరుణ్ పారుపల్లి