అక్షర సుగంధం కవిత్వం; ర: దేవలపల్లి సునంద; పు: 104; వె: Rs100; ప్ర: పాలపిట్ట బుక్స్, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాదు-36, 98487 87284
ఎమర్జెన్సీ జ్ఞాపకాలు వ్యాసాలు; ర: వేదుల నరసింహం; పు: 160; వె: Rs100; ప్ర: సాహిత్య నికేతన్, ఏలూరు రోడ్, గవర్నరుపేట, విజయవాడ -520002, 94406 43348
ఆత్మీయతకు ప్రతిరూపం హల్దేకర్జీ వ్యాసాలు; ప్రచురణ: శ్రీ భోగాది దుర్గాప్రసాద్ స్మరక సమితి; పు: 176; వె: Rs120; ప్ర: సాహిత్య నికేతన్, కేశవనిలయం, హైదరాబాదు, 040 27563236
కవీంద్ర మోక్షం కవిత్వం; ర: రఘుశ్రీ; పు: 110; వె: Rs100; ప్ర: వి.శ్రీలక్ష్మి, 2-1-421, ఫ్లాట్ నం.202, సాయినీ నిలయం, వీధి నం.4, నల్లకుంట, హైదరాబాదు -500004, 92471 08893
మహాభారతం - మతదర్శనం-1; ర: చంద్రశేఖరరెడ్డి చేగిరెడ్డి; పు: 228; విరాళం: Rs220; ప్ర: రచయిత, మొహిదీన్పురం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా-523336, 98663 09589
భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన వ్యాసాలు; ర: డా।। బి.సారంగపాణి; పు: 350; వె: Rs250; ప్ర: సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్పుర, హైదరాబాదు, 040 27563236
భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు వ్యాసాలు; ర: దామోదర సావర్కర్; పు: 368; వె: Rs250; ప్ర: సాహిత్యనికేతన్, ఏలూరురోడ్, గవర్నరుపేట, విజయవాడ, 94406 43348
భూమిపుత్రుడు కవిత్వం; ర: విడదల సాంబశివరావు; పు: 112; వె: Rs100; ప్ర: రచయిత, 3-173/1, పండరీపురం, చిలకలూరిపేట - 522616, గుంటూరు జిల్లా, 98664 00059
చైనాలోని పరిణామాలు భారత-చైనా సంబంధాలపైన...; ర: దేవులపల్లి వెంకటేశ్వరరావు; పు: 296; వె: Rs150; ప్ర: పోరునేల, హైదరాబాదు, 77028 88998, ప్రముఖ పుస్తక కేంద్రాలు
మహాప్రవక్త ముహమ్మద్ ఆధ్యాత్మికం; ర: అలపర్తి పిచ్చయ్య చౌదరి; పు: 100; వె: అమూల్యం; ప్ర: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప - 516002, 91770 13845
పద్య సిందూరం పద్యసాహిత్యం; ర: ఐతా చంద్రయ్య; పు: 72; వె: Rs80; ప్ర: రచయిత, ఇం.నం.4-4-11, శేర్పూర, సిద్ధిపేట - 502103, 093912 05299
యక్ష ప్రశ్నలు మహాభారతం; ర: కప్పగంతు వెంకట రమణమూర్తి; పు: 32; వె: Rs35; ప్ర: గ్లోబల్ న్యూస్, బి2, ఎఫ్12, రామరాజా నగర్, సుచిత్రా సెంటర్, సికింద్రాబాదు-67, 92461 65059
విజయ సోపానాలు కవిత్వం; ర: ఎం.ఎన్.విజయకుమార్; పు: 64; వె: Rs50; ప్ర: రచయిత, పాఠశాల సహాయకులు, హిందీ, 14-5-209/5, మధురానగర్, మహబూబ్నగర్, 97031 86814
నారీ సంస్కృతి వ్యాసాలు; ర: డా।। ఎన్.శాంతమ్మ; పు: 114; వె: Rs100; ప్ర: రచయిత్రి, ఫ్లాట్ నం.302, ప్రశాంత్ టవర్స్, రైల్వే స్టేషన్ రోడ్, కర్నూలు-518002, 99080 58172
శాంత తరంగిణి వ్యాసాలు; ర: సి.రోజమ్మ; పు: 56; వె: ఉచితం; ప్ర: రచయిత్రి, హెడ్, సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సుంకేశుల రోడ్, కర్నూలు-518002, 99122 56565
భలే మంచిరోజు న్యూమరిక్కులు; ర: డా।। రమణ యశస్వి; పు: 154; వె: Rs100; ప్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, విజయవాడ-3, 96188 48470
మహోన్నత శిఖరాలు కవితా మాలిక; ర: వావిలిపల్లి రాజారావు; పు: 184; వె: Rs100; ప్ర: వావిలిపల్లి సుజాత, గాంధీనగర్ వీధి, పొందూరు, శ్రీకాకుళం జిల్లా, 99636 06391
గుమ్మటాలు బాలల గీతాలు; ర: డా।। వడ్డి విజయసారథి; పు: 60; వె: Rs60; ప్ర: సాహిత్య నికేతన్, విజయవాడ, 94406 43348; సాహిత్య నికేతన్, హైదరాబాదు, 040 27563236
రామణీయకం పద్యాలు; ర: డి.రాములు (రాము); పు: 80; వె: అమూల్యం; ప్ర: రచయిత, 24సి-3-22, మంచినీళ్ల తోట, వినాయకగుడి వీధి, పత్తేబాద, ఏలూరు-534002, 94403 76688
మరణానంతర జీవనం ఆధ్యాత్మికం; ర: డా।। పెద్దాడ వేంకట లక్ష్మీ సుబ్బారావు; పు: 34; వె: Rs10; ప్ర: రచయిత, 204, సాయి ఎన్క్లేవ్, లంకవీధి, విజయనగరం, 94410 58797
రచయిత: తంగిరాల సోని; పుటలు: 112; వెల: Rs100; ప్రతులకు: రచయిత, ఇం.నం. 12-45/1, హైస్కూలు దగ్గర, కంచికచర్ల, కృష్ణా జిల్లా - 521180, 96766 09234
అవమానకర గ్రామీణ భారతాన్ని, ఆధిపత్య కులాల దుష్ట స్వభావాన్ని తరాల వెనుకబాటు తనాన్ని ప్రతిఘటిస్తూ తంగిరాల సోని బ్లాక్ వాయిస్ పేరిట రాసిన నలభై కవితలు బడుగు జాతుల సామాజిక దుస్థితికి ప్రతిరూపాలు.
కంచికచెర్ల, కారంచేడు, పదిరి కుప్పం లాంటి ఘటనల నేపథ్యాన్ని, పోరాట పటిమని వారసత్వంగా తీసుకుని.. రాసిన ఈ కవితల్లో ‘‘ఎగరేసిన ఆత్మగౌరవ ధిక్కార పతాకమై కవిత్వం ఎగరాలి. అక్షరాల్లో పొగరుండాలి. చూరుకింద కారుతున్న నీటి శబ్దం తెలియాలి!’’ అనే భావావేశం కనిపిస్తుంది. ఈ కవితలనిండా ఆవేదన ఉంది. కవితాత్మక ప్రతిఘటన ఉంది. అక్షరం కూడా ఆయుధమేననీ, పదునెక్కిన భావాలే బరిసెలై కర్తవ్య నిర్దేశం చేస్తాయనీ, అవే వినూత్న భావధారకూ, ఉద్యమ కార్యాచరణకు ఊపిరిగా కవి అందించిన నూతన భావ స్రవంతి ఈ కవితా సంపుటి.
- సాహితీసుధ
రచయిత: రావెల సాంబశివరావు; పుటలు: 208; వెల: Rs200; ప్రతులకు: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, 98480 65658
ముందు తరాలు ఇటువంటి వ్యక్తి రక్త మాంసాలతో భూమ్మీద తిరుగాడారని నమ్మలేక పోవచ్చు... అంటూ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్స్టీన్ గాంధీజీ గురించి అన్నమాట అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే ఒక్కమాటలో అంతకన్నా బాగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. సంజీవదేవ్ గురించి విన్నవారు, రచనలు, లేఖలు చదివినవారు, ప్రసంగాలు విన్నవారు, ఆయన చిత్రాలు చూసినవారు ఆయన ఆలోచనలు, భావజాలాలు... ఇదంతా తెలిసినవారు కూడా ఇలానే అనుకుంటారు. సంజీవదేవ్ని ఆస్తికుడని కొందరు నమ్ముతారు. నమ్మనివారికి ఆయన నాస్తికుడు. ఆయనకు కులమత వర్గ భేదాలు తెలియవు. మంచీచెడుల మధ్య అగడ్తలు, అగాధాలు అధిగమించలేనంతటివి కావన్నది ఆయన అభిప్రాయం. చిత్తశుద్ధి లేని కర్మకాండల్ని సున్నితంగా హేళన చేశారు. బడి చదువులు లేవు, కానీ ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టర్ ఆఫ్ లెటర్స్’ పొందారు. ఎందుకంటే తాను జీవిస్తున్న దేశాన్నీ, కాలాన్నీ అర్థం చేసుకొని తన రచనల ద్వారా, చిత్రాల ద్వారా ఇతరులకు తెలియజేసిన చదువరి ఆయన! ఆధ్యాత్మికానుభవానికీ, ఆధ్యాత్మిక సంస్కృతికీ మధ్య తేడా గుర్తించగలిగిన సంపూర్ణ మానవ చైతన్యం కలిగిన మనీషి ఆయన! దేశంలో ఈ చివరి నుంచి ఆ చివర వరకు తిరగడమే కాదు నెలల తరబడి సంవత్సరాల తరబడి జీవించారు. తాజ్మహల్ని చూసి తనకు ఎందుకు ఆశాభంగం కలిగిందో చెప్పగలిగారు. ప్రపంచంలో ఏ దేశపు మాతృభాషకు కూడా అంతర్జాతీయ భాష అయ్యే అర్హత లేదని తేల్చినవారాయన. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా తెనాలి ప్రచురణ సంస్థ తలపెట్టిన ప్రత్యేక ప్రచురణలలో భాగంగా తొలి కుసుమాన్ని రచయిత రావెల సాంబశివరావు ‘సంజీవదేవ్ జీవనరాగం’ అనే వెయ్యి రేకుల పద్మాన్ని లోకానికి అందించారు. సంజీవదేవ్ బాల్యం నుంచి... అంటే 1914 నుంచి 1999 వరకు గల ఎనిమిది దశాబ్దాల పైచిలుకు జీవితంలో ముఖ్యమైన వర్ణాల్ని సాంబశివరావు తన సంజీవని రాగంలో పలికించారు. చిన్నతనంలోనే అమ్మనీ, చెల్లినీ పోగొట్టుకున్న సంజీవదేవ్ ఈ ప్రపంచాన్ని అమ్మలా భావించారు. అందర్నీ అమ్మలానే ఆదరించారు. నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా ఉద్యోగ విరమణానంతరం సాంబశివరావు ప్రపంచానికి అందించిన ఈ జీవనరాగంలో పాతిక ఛాయలున్నాయి. వాటిల్లో సంజీవదేవ్ ఉత్తరాలు, శ్రీరమణ, వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందు మాటలు, దేవ్ చిత్రమాలికలు అదనపు ఆకర్షణలు.
- ఉపదేష్ట అగ్నివేశ్
రచన: వేదాంతం లక్ష్మీ ప్రసాదరావు; పుటలు:111; వెల:Rs. 80; ప్రతులకు: నవోదయ బుక్హౌస్, కాచిగూడ, హైదరాబాదు
క్రీస్తుపూర్వం 5, 6 శతాబ్దాలు ప్రపంచం మొత్తమ్మీద ఉన్నతమైన ఆలోచనా పవనాలు వీచిన కాలం. సత్యాన్వేషణే పరమావధిగా దేశదేశాల్లో తత్త్వవేత్తలు కొత్త వెలుగులు ప్రసరింపజేశారు. భారతదేశంలో బుద్ధుడు, మహావీరుడు; గ్రీకు దేశంలో సోక్రటీసు, ప్లేటో; ఇరాన్లో జరాతుష్టుడు లాంటి వారు తమ భావజాలంతో సమాజంపై పెనుప్రభావం చూపారు. సంస్కృతీ వికాసానికి దోహదపడ్డారు. చైనాలో కన్ఫూషియస్, లావోజి, జున్జి లాంటివారు ఇదే కాలంలో ఆ దేశ తాత్విక సంప్రదాయాన్ని మలుపు తిప్పారు.
ఈ ‘చైనా తత్త్వవేత్తలు’ పుస్తకంలో ప్రాచీనులైన కన్ఫూషియస్, లావోజిల ఆలోచనా విధానాన్నీ, ఆధునికుడైన మావో దృక్పథాన్నీ సంగ్రహంగా వివరించే ప్రయత్నం చేశారు రచయిత.
వేల సంవత్సరాల క్రితం నాటి లావోజి సూక్తులు సరళంగా ఉండటం విశేషం. ఆచరణశీలత వీటి ప్రత్యేకత. తాత్విక చింతన అనేది చైనా తాత్వికుల దృష్టిలో మేధోపరమైన ప్రక్రియ కాదు. అది జీవితంతో ముడిపడి ఉంటుంది. ప్రాచీన తాత్విక దృక్పథాల గురించి ఈ ఆధునిక కాలంలో తెలుసుకోవడం కేవలం జిజ్ఞాసను సంతృప్తి పరుచుకోవటానికి మాత్రమేనా? ప్రాచీన తాత్విక దృక్పథాల అధ్యయనం ఆనందదాయకమే కాదు, అవసరం కూడా అని రచయిత స్పష్టం చేస్తారు. ‘మన మూలాలు మనకు తెలిస్తేనే మనం సరైన మార్గంలో ప్రయాణించగలం- జీవితంలో’ అంటారు. ‘నిజాల్ని వర్ణించలేం- నిశ్శబ్దాన్ని ధ్వనించలేం’; ‘అందమైన చిత్రాలు మనల్ని అంధులుగా చేస్తాయి, సుమధుర సంగీతం మనల్ని చెవిటివాళ్ళుగా మారుస్తుంది, షడ్రసోపేత భోజనం మన జిహ్వను పాడు చేస్తుంది’- ఇలాంటివి మనలో ఆలోచనలు రేపుతాయి. లావోజికి పూర్వుడైన కన్ఫూషియస్ ప్రభావం చైనాలోని విద్యావిధానంపై ఇరవై శతాబ్దాలపాటు కొనసాగింది. మార్క్సిస్టు సిద్ధాంతాలను నమ్ముతూనే వాటికి మార్పులు చేసి ఆచరణలో చూపిన మావో సిద్ధాంతం గురించి కూడా ఈ పుస్తకం సంక్షిప్తంగా వివరిస్తుంది. తేలికగా అర్థమయ్యే భాషాశైలి పఠనీయతను పెంచింది. సైద్ధాంతిక అంశాలు వివరించే ఇలాంటి పుస్తకంలో అక్షర దోషాలు దొర్లకుండా ప్రచురణకర్తలు జాగ్రత్త తీసుకోవాల్సింది. కన్ఫూషియస్ అందరికీ విద్య అవసరమని గట్టిగా విశ్వసించిన వ్యక్తి. లోకంలో పుట్టుకతో అందరూ సమానమేనంటాడు. వాగ్వివాదాలపై దృష్టి పెట్టకుండా మనిషి మంచితనం, కరుణ స్వభావం, నైతిక ప్రవర్తన, సుగుణ సంపదల మీదనే ఎక్కువ ఆలోచించి ప్రచారం చేశాడు. వాటిని ప్రజలు ఆచరించాలని ప్రబోధించాడు.
- సీహెచ్.వేణు
రచయిత్రి: డా।। కె.వి.కృష్ణకుమారి; పుటలు: 160; వెల: అమూల్యం; ప్రతులకు: సంచాలకులు, ఆం.ప్ర.రాష్ట్ర సాంస్కృతిక శాఖ, హైదరాబాదు
మన తెలుగువారే అని చెప్పుకోవడమే కానీ నీలం సంజీవరెడ్డి గురించి ఈ తరానికి తెలిసింది చాలా తక్కువ! ఆ లోటుని భర్తీచేసేందుకా అన్నట్లు నీలం జీవిత విశేషాలతో వచ్చిందీ పుస్తకం.
‘నిరుపమాన త్యాగధనుడు నీలం’ అంటూ పీఠికలోనే సంజీవరెడ్డి జీవన ప్రస్థానాన్ని సూక్ష్మంగా పరిచయం చేశారు రచయిత్రి. ఆ తరువాత 11 అధ్యాయాల్లో నీలం గురించి సమగ్ర సమాచారాన్ని అందించారు. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామం ఇల్లూరులో జన్మించినప్పటి నుంచి స్వాతంత్య్రోద్యమంలో ఆయన పాత్ర వరకూ తొలి అధ్యాయం ‘జననం- బాల్యం’లో వివరిస్తారు. ఆనాడే మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన నీలం తండ్రి చిన్నపరెడ్డి వ్యక్తిత్వం, మేనమామ తరిమెల సుబ్బారెడ్డి ప్రభావం ఇందులో ప్రస్ఫుటమవుతాయి.
‘రాజకీయ ప్రస్థానం’ అధ్యాయంలో, స్వాతంత్య్రోద్యమంలో నీలం అంచెలంచెలుగా ఎదిగిన వైనం తెలుస్తుంది. చిరునవ్వుతో జైలు జీవితాన్ని ఎదుర్కొన్న ఆయన నిబ్బరం, గాంధీజీని సైతం మెప్పించిన పోరాటపటిమ ఉత్తేజాన్ని రగిలిస్తాయి. దేశ స్వాతంత్య్రం, అనంతర పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ అవతరణ... దానికి తొలి ముఖ్యమంత్రిగా నీలం సేవలు వంటి చారిత్రక ఘట్టాలను ఉదహరించారు. ఉన్నత న్యాయస్థానం చేసిన చిన్న వ్యాఖ్యతో నీలం ముఖ్యమంత్రి పదవినే త్యజించారన్న విషయం ఇప్పటి తరాలకు ఆశ్చర్యం కలిగించక మానదు. 1967లో నీలం లోక్సభాపతిగా ఎన్నికయ్యారు. సభను నడిపించడంలో ఆయన చతురతను ‘అత్యంత విశిష్ట సభాపతి’ అధ్యాయంలో వివరించారు. ఒక సందర్భంలో తన మాటని పట్టించుకోకుండా అరుస్తున్న సభ్యుణ్ని ఉద్దేశిస్తూ ‘నేను గౌరవ సభ్యుణ్ని అరవవలసిందిగా ఆహ్వానిస్తున్నాను’ అన్నారట నీలం. ఆయన వ్యక్తిత్వానికి, సునిశిత హాస్యానికి నిదర్శనంగా నిలిచే ఇలాంటి ఉదాహరణలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘నేటి రాజకీయ నాయకులకి ఇటువంటి మహనీయుల గురించి పట్టించుకోవలసిన అవసరమూ, తీరికా లేకపోవడం దురదృష్టకరం’ అన్న రచయిత్రి ఆవేదన ఈ పుస్తకంతో కొంతమేరైనా తీరుతుందని ఆశిద్దాం.
- సూర్య
రచయిత: మందపాటి సత్యనారాయణరెడ్డి; పుటలు :460; వెల :రూ.250 ప్రతులకు : యం.పుణ్యవతి, కుకట్పల్లి, హైదరాబాద్; 94402 08767
ప్రపంచ సాహిత్యంలో భగవద్గీత స్థానం విశిష్టం. దాన్ని ఎవరికి కావాల్సిన కోణంలో వారు అన్వయించుకోవచ్చు. భక్తులకు అది ఆధ్యాత్మిక, తత్త్వ సాగరం. భక్తి భావన లేని వారికి అత్యుత్తమ వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఎలా చూసినా, చదివినా మేలే! భారతీయ, భారతీయేతర భాషల్లో భగవద్గీతను వ్యాఖ్యానిస్తూ వందలాది రచనలు వచ్చాయి. ఒక్కో రచయితదీ, ఒక్కో కవిదీ ఒక్కో పంథా. కొంత మంది శ్లోకాలకు వివరణతో సరిపెడితే, కొందరు వాటికి స్వీయ భాష్యాలు చెప్పారు. ఇంకొంత మంది ప్రతిపదార్థ తాత్పర్యాలూ చెప్పారు. మరి కొందరు వాటికి ఆధునిక అన్వయాలు ఇచ్చారు! వ్యక్తిత్వ వికాస కోణంలో కథలు అల్లారు. పిల్లల కోసం భగవద్గీతను కథల రూపంలో చెప్పిన వారూ ఉన్నారు. ఎవరి కృషి, బాణీ వారివి.
ఈ కోవలో ప్రముఖ గ్రంథ రచయిత మందపాటి సత్యనారాయణరెడ్డి మరో కోణంలో చేసిన ప్రయోగమే ఈ ‘భగవద్గీత... ఉన్నదున్నట్లుగా’ గ్రంథం. భగవద్గీత శ్లోకాలను యథాతథంగా ఇస్తూ, వాటి సారాంశాన్ని పద్య రూపంలో చెబుతూనే దానికి వివరణ, వ్యాఖ్యానాన్ని జోడించారు. 460 పేజీల ఈ గ్రంథంలో సరళ తెలుగు ధారాళంగా ప్రవహిస్తుంది. మచ్చుకి ఒకటి చూడండి... ‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం’ శ్లోకానికి... ఇతరులకు బాధ కలిగింప నిష్టపడక/ సత్యము ప్రియంబు హితమును చాటు వాక్కు/ సతత స్వాధ్యాయనాభ్యాస సరళియున్ను/ వాచిక తపమనుచు నుదువబడె పార్థ।।... అంటూ తేలిక మాటలతో పద్యాన్ని అల్లుతారు. దానికి మళ్లీ వివరణా జోడించారు. శ్లోకాల్లో ప్రస్తావనకు వచ్చే పాత్రల గురించి వివరిస్తూ, సంస్కృత పదాలకు అర్థ వివరణలను చెబుతూ.... నిపుణుడైన ఆధ్యాత్మికవేత్త ఎవరో మన ముందే కూర్చుని ప్రవచనాన్ని అందిస్తున్న అనుభూతిని కలిగిస్తారు. గ్రంథం చదవడం పూర్తయ్యే సరికి భగవద్గీత శ్లోకాలే కాదు, వందలాది పాత్రలు వాటి సంక్షిప్త పరిచయాలు, వేలాది పదాలు వాటి అర్థ వివరణలు, హిత బోధలు, అంతరార్ధాల విడదీత, శ్లోకాల్లోని మర్మాలు... ఇలా ఎన్నో అంశాలు మన మది నిండా నిండిపోతాయి! భారతం మొత్తం చదివేసిన భావన కలుగుతుంది. ఇంతకు ముందు భగవద్గీత చదివిన వారికీ ఈ గ్రంథం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చదవడానికి వీలుగా పెద్ద అక్షరాలతో ముద్రించిన ఈ గ్రంథం పుస్తక ప్రియుల్ని ఆకర్షిస్తుంది. చదివాక తప్పనిసరిగా అలరిస్తుంది.
- జాస్తి సరిత
ప్రతులకు: రచయిత: కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళై: పుటలు: 273+24, వెల: రూ.180: ప్రతులకు: సొసైటీ కాలనీ, మదనపల్లె, 9502304027
ఒక చారిత్రక ఇతివృత్తానికి కాస్త కల్పనను జోడించి కరణం బాలకృష్ణ పిళ్ళై రచించిన నవలే ‘బోయకొట్టములు పండ్రెండ్రు’. అద్దంకిలో దొరికిన పద్యశాసనం, అందులోని పండరంగడు, బోయకొట్టాలు, కట్టెపుదుర్గం, త్రిభువనాంకుశ బాణం, ఆదిత్య భట్టరు పాత్రలు, చరిత్రలో కనిపించే పృథ్వీ వ్యాఘ్రరాజు, చాళుక్య పల్లవ రాజవంశాలు తప్ప మిగిలిన పాత్రలు - కథ అంతా కల్పనే.
నవల చదివాక పాఠకుల హృదయాల్లో అద్దంకిలోని నక్షత్రశాల నిలిచిపోయి నిజంగా అక్కడ ఒకప్పుడు ఖగోళ పరిశీలన జరిగిందేమో అన్న అనుమానం బలపడుతుంది.
మంగసాని తెగువ, వీరబోయ- జయశ్రీల ప్రేమ కలాపం, నన్ని-పొన్నిల అనుబంధం, పొన్ని- వకుళల సరస సంభాషణలు అన్నీ నిజమేననిపిస్తాయి. రెండు పెద్ద రాజ్యాల మధ్య ఒక చిన్న స్వతంత్ర రాజ్యం ఎలా నలిగిపోతుందో చక్కగా వర్ణించారు రచయిత.
- చింతలపూడి
రచయిత: కంకంటి నారసింహరాజు; పుటలు: 178; వెల: Rs150; ప్రతులకు: ఉన్నం జ్యోతివాసు, వేములపాడు; ప్రకాశం జిల్లా.
‘విష్ణుమాయా విలాసము’ను కంకంటి పాపరాజు తమ్ముడు నారసింహరాజు ద్విపద కావ్యంగా రచించాడు. దీన్ని ఉన్నం జ్యోతివాసు పరిష్కరించి, పునర్ముద్రించి, విషయాలన్నీ పీఠికలో చర్చించారు. పాల్కురికితో మొదలై తర్వాత వచ్చిన ఎన్నో ద్విపద కావ్యాలు తెలుగు భారతిని సమర్చించాయి. వర్ణన ప్రధానంగా పద్యకావ్యాలు రాజ్యమేలుతున్నప్పుడు ద్విపదలో ఈ కథాకావ్యం రావడం అశ్చర్యకరం. ఇందులోని కథలకు మూలమనదగిన పురాణం కానీ, కావ్యంగానీ అటు సంస్కృతంలోను, ఇటు తెలుగులోనూ కనిపించదు. ఆయా స్థలపురాణాల నుంచి, మహాపురాణాల నుంచి కథలను తీసుకొని కల్పనాశక్తితో ఏకసూత్రంగా కూర్చడంలో కవి ప్రతిభ అనన్యం. అయిదు ఆశ్వాసాల ఈ గ్రంథంలోని కథలన్నీ విష్ణుమాయ ప్రభావాన్ని తేటతెల్లం చేస్తాయి. శబ్ద, అర్థాలంకారాలతో పాటు చిత్రకవిత్వపు పోకడలు కూడా సాటిలేని విధంగా ఇందులో కనిపిస్తాయి. అచ్చతెలుగు పలుకుబళ్లతోపాటు జాతీయాలు, నుడికారాలు సందర్భోచితంగా ప్రయోగించడంతో కావ్యం తెలుగుదనంతో గుబాళిస్తోంది.
- చారి
రచయిత: బెజ్జారపు రవీందర్; పుటలు: 110; వెల: Rs.60, ప్రతులకు: రచయిత, కరీంనగర్, 94910 46104; పాలపిట్ట బుక్స్, హైదరాబాదు
అక్షరాలు అమ్మలా లాలిస్తాయి, వైద్యుడిలా ప్రాణాల్ని నిలబెడతాయి, మిత్రుడిలా వెన్నంటి ఉంటాయి. ప్రియురాలిలా అనుభూతిని పంచుతాయి. మనం తలచుకున్న రూపంలో మలచుకోవటానికి మనముందు నిలుచున్న సజీవ శిలలు అక్షరాలు. వాటి విరాడ్రూపమే అనంత సాహిత్యం. ఆ సజీవ శిలల్లో ఒకటి ‘నిత్యగాయాల నది’. బెజ్జారపు రవీందర్ పలు పత్రికల్లో రాసిన 11 కథల గుచ్ఛమిది. ‘నిత్యగాయాల నది’ కథలో దేశం కోసం ఆత్మార్పణ చేసినా పెత్తందార్ల ప్రేరణతో మూగబోయిన కోటి రతనాల వీణ దైన్యస్థితి వెల్లడైంది. ‘గోగుపూలు’లో పాట విప్లవాల బాట నడిస్తే దాని రూపం మోదుగుపూవులా వికసిస్తుంది. అది ఆదిమానవుడి పొలికేక అయినా దాన్నీ వినిపించనీయడం లేదనే బాధ కనపడుతుంది. ‘ఒంటికాలి శివుడు’లో ఒగ్గు కథ ఏ శాస్త్రీయ సంగీతానికీ తీసిపోదన్న నిదర్శనం ఉంది. ‘కొత్తరంగులద్దుకున్న కల’లో పోరుబాటకై నోరు మెదపని పవిత్రుల కన్నా రణన్నినాదం చేసే గుండెలు కావాలన్న ఆకాంక్ష వెల్లడైంది.
- శర్మ
రచయిత్రి: ఐతరాజు స్రవంతి; పుటలు: 203, వెల: Rs.150; ప్రతులకు: విశాలాంధ్ర బుక్హౌస్ అన్ని శాఖలు, 9618503480
మానసికంగా ఆరోగ్యవంతులైన వాళ్లే జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను సమర్థంగా ఎదుర్కోగలరు. కానీ ఆధునిక కాలంలో అనేక కారణాలవల్ల మనిషి మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నాడు. వాటి ప్రభావం అతడి ప్రవర్తనలో ప్రస్ఫుటమవుతో ంది. ఎవరైనా వింతగా ప్రవర్తిస్తుంటే వారు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లే. అలాంటి వ్యాధులను గుర్తించడమెలా? బాధితులకు సాంత్వన చేకూర్చాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు మనకెవరికీ సమాధానాలు తెలియవు. ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు ఐతరాజు స్రవంతి. మానసిక వైద్యురాలై న ఆమె తాను వైద్యం అందించిన వ్యక్తుల నిజ జీవిత సమస్యలను అందరికీ అర్థమయ్యేలా ‘మనసు తలుపు తెరిస్తే’ పుస్తకంలోని 16 కథల్లో చెప్పారు. ప్రతి ఒక్కరూ మనోవ్యాధులపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మానసికరోగులు కాకుండా ఉండాలంటే వారి మనసు తలుపు తెరిచి చూడాలంటున్నారు.
- అంచల భాస్కర్